Sunday, April 24, 2022

Emotions recollected in tranquility -8.

 నా కాశీ యాత్ర -8

ఇంక మిగిలింది అస్సీ ఘాట్ . అది చూడాలి అని మళ్ళీ పొద్దున్నే లేచి అయిదింటికల్లా అస్సీ ఘాట్ చేరాము . అసలు వీలైతే గంగా స్నానం , పెద్దలకు అర్ఘ్యం అనుకున్నాము . కాని అక్కడకి చేరే సరికి పొద్దున్న హరతికి సన్నాహాలు జరుగుతున్నాయి . ఒక సంస్థ వారు ( ఏ సంస్థో తెలియలేదు ) పిల్లలని తీసుకుని వచ్చారు . పొదున్నే ఆ ఘాట్ల మెట్ల మీద కూర్చుని పిల్లలు పాడిన స్త్రోత్రాలు విన్నాము . తెలి సంధ్య కాంతులు ఇంకా పూర్తిగా పట్టణాన్ని మేలుకొలపలేదు కాని ఘాట్ దగ్గర సందడే సందడి . 

ఒక గంట అక్కడ కూర్చుని స్నానానికి కేదార్ ఘాట్ వీలని దిలీప్ మాట మీద మళ్ళీ అటు వెళ్ళాము . అయితే భార్గవి మళ్ళీ ఆ మెట్లు దిగలేనంది . నిమ్మి మాత్రం ప్రసాద్ గారు వద్దులే అన్నా వెళ్ళింది . మేము కారులొనే కూర్చున్నాము . ప్రసాద్ గారు గంగా స్నానం చేసి , పోయిన వారందరి పేరు మీద పూజలు చేసారు . తెలుగు బ్రాహ్మణులు దొరకలేదండి , ఒక ఉత్తర భారతీయ పూజరి గారి నిర్వహణలో పూర్తి చేసాను అన్నారు . నిజానికి అది ఆయన 25 వ తారీకు , హేమచంద్ర పుట్టిన రోజు నాడు చెయ్యాలి అనుకున్నారు కాని అలా ముందు అనుకోలేదు కనుక కుదరలేదు . బహుశా నా మనస్సులో ఎక్కడొ రెండూ ఒక రోజు అని ఇష్ట పడ లేదేమో ?! మా స్నానానికని చిన్న బాటిల్స్ లో నీరు పట్టుకొచ్చారు . 

 మేము రూము కి వచ్చి 'గంగా ' స్నానం చేసాము . ఇక అక్కడ నుండి షాపింగ్ . ఆదివారం . ఒక్క షాప్ దొరికింది . పాపం ఆ షాపు లోని వ్యక్తి , మేము కాసేపు హిందీ లో కుస్తీ పట్టాక ఇంక లాభము లేదని తెలుగు వచ్చిన వ్యక్తిని పంపాడు . ఆయన విజయనగరం అన్నాడు . భార్గవి రాసినట్లు కడప దగ్గర విజయనగరం అయ్యి వుంటుంది . ఒక జీవిత సత్యం చెప్పాడు -" కాశీ విశ్వనాధుడు అక్కడ , బెజవాడ కనకదుర్గమ్మ ఇక్కడ దొరకరు ; మిగతావన్ని అన్ని చోట్ల దొరుకుతాయి . మీకు ఇక్కడేమి స్పెషల్ ఉండవు "అని . ఇంకెందుకూ అని రెండు బ్లౌజ్ ముక్కలు కొని , ఒక చీర తీసుకుని బయట పడ్డాము . 

ఇంక మిగిలింది రాం నగర్ ఫొర్ట్ . సరే నని మధ్యాహ్నం అటు వెళ్ళాము . అదీ పెద్ద కోట . కాశీ రాజు గారి నివాసం . ఇప్పటి కాశీ రాజు అక్కడ ఉంటారుట . బ్రిడ్జి దాటి వెళ్ళాలి . గంగ ఆవల ఒడ్డున ఉంది . బ్రిడ్జి నుంచి చూస్తే భలే అందంగా ఉంది . గంగ ఒడ్డు. వరద వచ్చిన మునగకుండా ఎత్తులో కట్టారు . ఇప్పటి రాజు పేరు అనంత్ నారయణ్ సింగ్ ట . ఈ కోట వారణాసి నుండి 14 కిలోమీటర్లు దూరం లో ఉంది . అయితే BHU కి దగ్గర . రెండు కిలోమీటర్లు . 

 ఇది ఒక భాగం ప్రదర్శకులకు వదిలారు . maintenance  ఏమీ బాగాలేదు. టికెట్ ఉంది కాని లోపలంతా దుమ్ము ధూళీ , ఏవీ వివరంగా లేవు . ఆ కోట చరిత్ర లేదు . అయితే ఈ కోట మరీ పాతది కాదు -1750 లోనే కట్టారుట . అయితే లోపల కోర్ట్ యార్డ్ బాగుంది . మాతో పాటు చూడాడనికి వచ్చిన ఒక విద్యార్థి ఆ maintenance  చూసి బాధ పడ్డాడు . తను అన్నాడు ఇంతకంటే చూడవల్సింది దీనికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అని . వాటర్ ఫాల్ ? అదెక్కడా అని అడిగితే -- అయ్యో అది చూడలేదా ? చందౌలి అని వారణాసి కి 60 కి దూరంట . ఇంకా అయిదారు ఉన్నాయిట --60, 65 కి దూరంలో . అంత ఓపిక లేదు . 

బయటకు రాగానే దిలీప్ లస్సి laced with కోవా ఇచ్చాడు . భలే రుచిగా ఉంది . అంత తినాలంటే భయం పైగా తీపి అలవాటు తప్పింది . ఇష్టమున్న వారు మాత్రం మిస్ అవకూడదు . అక్కడే ఫొర్ట్ ముందు ఫొటొ అంటూ వెంటబడి డబ్బులు తీసుకుని -- పైగా మూడూ కాపిలు -- ఒక అలుక్కుపోయిన , భయంకరమైన ఫోటోలు కవర్లో పెట్టి ఇచ్చాడు . కారులోకి ఎక్కాక చూసుకున్నాము . అయినా పాపం మాలాంటి వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళూ బతికేది ! 

  ఇక చివరి ప్రోగ్రాం ! అప్పటికే నాలుగు రోజులైంది . మల్లాది సూరిబాబు గారు ఆయన వ్యాసం లో దీక్షితుల వారు కాశీ లో శ్రీ చక్రం ప్రతిష్టించి దానిపై ఒక శివ లింగం ప్రతిష్టించారని విన్నాను . అక్కడ ఆయన ఒక ఆరు నెలలు ఉన్నారుట . ఆ తరువాతే గురువుగారి ఆదేశం పై సుబ్రహ్మణ్యు న్ని దర్శించుకుని ఉపాసన చెయ్యడం అంతా జరిగిందిట . అది చూడాలని ! అక్కడ ఎవరూ తెలియదు అన్నారు . భగవంతుడి లీలో ! కాకతాళీయమో ! పొద్దునే మల్లాది శ్రీ రాం ప్రసాద్ వేరే పని మీద ఫోన్ చేసారు . అప్పుడు ఈ గుడి గురించి అడిగాను . వెంటనే అక్కడ BHU లో ఉన్న మృదంగ విద్వాన్శునికి ఫోన్ చేసి , ఆ గుడి పూజారి గారిని కలిపారు . ఆయన రాం నగర్ ఫోర్ట్ నుంచి దగ్గర అని అటు దారి చెప్పారు . అది హనుమాన్ ఘాట్ దగ్గర ఉందిట . ఒక సందు వరకు వెళ్ళాక అక్కడి నుంచి నడవాలి . ఆయన శిష్యుని పంపి లోపలకి తీసుకు వెళ్ళారు . చిన్న గుడి . అందులొనే పూజరుల నివాసం . కాశీ లోని ఎన్ని వందల లింగాలలో ఒకటి కాని మనకి అది ముఖ్యం . అక్కడ భార్గవి దీక్షితార్ కృతి ఒకటి పాడింది . అక్కడనుండి తృప్తిగా బయట పడ్డాము . మర్నాడు ప్రయాణం . వారణాసి జిలేబి తెచ్చాడు దిలీప్ . అది ఎంతో రుచిగా ఉందిట . నేను తినలేదు .ఆ రాత్రి అందరం ఒకే రూము లో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము . మర్నాడు ప్రయాణం ముందు మాకు వేడిగా జిలేబి , పాన్ కావలని అడిగాము . పొద్దున్నే అవి తీసుకుని దిలీప్ వచ్చాడు . మా అమ్మకి జిలేబి ఇష్టం , పాన్ ఇష్టం . నాకూ పాన్ ఇష్టం . బిల్స్ సెట్టిల్ చేసి మెల్లగా వెనక్కి బయలుదేరాము . అప్పుడు నిజంగా బెంగ అనిపించింది . ఈ నాలుగు రోజులు కాశీ లో స్నేహితులతో హాయిగా గడిచింది . 

విమానం టైముకి వచ్చింది . ఆ ప్రయాణం లోనే విమానం packed గా ఉండడం , మా పక్కన కూర్చున్న ఆయన వలన కలిగిన అసౌకర్యం వల్ల భార్గవి ఇబ్బంది పడింది . హైదరాబాద్ లో దిగగానే హమ్మయ్య అనుకున్నాము . ముందే బుక్ చేసుకున్న కార్ రావడం మేము ఇంటి ప్రయాణం మొదలు పెట్టాము. అప్పటికే రెండు దాటిందని చౌటప్పల్ దగ్గర విలేజ్ ఫూడ్ లో భోజనం చేసాము . ఎనిమిదింటికల్లా విజయవాడ  వచ్చేసాము . భార్గవి పామర్రు వెళ్ళి పోయింది .

ఇదండీ మా కాశీ యాత్ర . కింద నిమ్మి చెప్పినట్లు దిలీప్ నంబర్ కావలంటే ఇస్తాను . అతనికి తెలుగు రాదు . కొంచం ఇంగ్లీష్ వచ్చు . కాని మంచి వాడు . జాగ్రత్తగా అన్నీ చూపాడు . 

ఒక ప్రయాణం ఒక జీవితానుభవం . మన గురించి మనకు తెలియజేసే ఒక పాఠం ! కాశీ అందులో ఒక ప్రత్యేక అనుభవం .

స్వస్తి 

   


Emotions recollected in tranquility-8

 కాశీ యాత్ర -7

బుద్ధం శరణం గచ్చామి ! సంఘం శరణం గచ్చామి !

నాలుగు రోజులు తిరిగి ఇంత రాస్తున్నావేమి అని నవ్వుకుంటున్నారా ? ఏదో ఆలొచనలు పంచుకుందామని . 

   మధ్యాహ్నం నాలుగింటికి బయలుదేరి సార్నాథ్ వెళ్ళాము . సారనాధ్ , వారాణాశి కి ఏడు , ఎనిమిది కిలో మీటర్లు దూరం లో ఉంది . మన హైదరాబాద్ , సికిందిరాబాద్ లాగ . అరగబంట లొపే చేరాము . అక్కడ ఆర్కియాలజి మ్యూజియం , బౌద్ధ స్థూపాలు రెండు ఉన్నాయి . మ్యూజియం , సార నాధ్ స్తూపానికి అయిదింటికల్లా మూసేస్తారు అన్నారు .ముందు బౌద్ధ దేవాలయానికి వెళ్ళాము . నిజానికి దాని వెనకాల ఒక రిట్రీట్ సెంటర్ ఉందిట . అది తరువాత తెలిసింది . మా అబ్బాయి ఒక వారం రోజులు అందులో ఉన్నాడు . 

హిందూ మతమే కాక బౌద్ధానికీ కాశీ ముఖ్య మైన ప్రదేశము . బుద్ధుడు తన మొదటి తపస్సు ఈ అడవులలోనే చేసాడుట . ఆ రోజుల్లొ కాశీ పట్టణం చుట్టూ అడవులు , ఎన్నో చిన్న చిన్న మడుగులుతో ఎంతో ప్రశాంతం గా ఉండేదిట. ఇప్పుడు చూద్దామన్న ఏమీ లేవు . అలాంటి అడవిలో తపస్సు చేసి ఇది మార్గం కాదని వెళ్ళిన సిద్ధార్ధుడు , తనకు బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యాక ముందుగా తనకి తెలిసిన సత్యం తెలియజేయడానికి సారనాథ్ వచ్చి అక్కడ తన మొదటి భాషణ ఇచ్చారు . ఆ ప్రదేశం చూపిస్తారు . ఆ భాషణ విన్న ఆయనతో పాటు అంతకు ముందు తపస్సు చేసిన స్నేహితులు ఆయనకి ముందు శిష్యులయ్యారు . ఈ ప్రదేశాన్ని సంఘారామ అంటారు . మధ్యలో 60 మీటర్లు ఎత్తు విహారం వుంది . ఆ విహార కప్పు పైన బంగారు మామిమామఉంది  .మధ్యలో ఎత్తైన బుద్ధుని విగ్రహం ఉంది . ఆయన జ్ఞానం పొందిన బోధి చెట్టు కొమ్మ అక్కడ నుండి తెచ్చి ఇక్కడ పెట్టారుట . అది ఇంకా ఉంది . నిజానికి బోధ్ గయ లో అసలు చెట్టు పడిపొతే మళ్ళీ ఈ చెట్టు కొమ్మని అక్కడకు తీసుకుని వెళ్ళి పాతి పెట్టారుట . ఇప్పుడు బోధ్ గయ లో ఉన్నది ఆ చెట్టు . 

   మొదట భాషణ ఇచ్చిన ప్రదేశం లో ఒక స్తూప ఉంది . మన అశొక స్తూపనికి నమూన నాలుగు సింహాలు అక్కడ ఉంది . అలాగే బామియాన్ బుద్ధుని విగ్రహాలు ఆఫ్ఘనిస్తానులో తాలిబాన్లు పేల్చేసాక అదే నమూన తో థాయి లాండ్ ప్రభుత్వం తో కలిసి 80 అడుగుల విగ్రహం నిర్మించారు . ఇది చెయ్యడానికి 14 సంవత్సరాలు పట్టింది . బుద్ధ విగ్రహం ముందు ఆహ్లద కరంగా ఒక నీటి మడుగు కలువలు , తామరలతో ఉంది . వాటి ఎదురుగా మాయదేవి విగ్రహం ఉంది . ఆ ప్రదేశం అలా గబ గబా చూడాల్సిన ప్రదేశం కాదు . ఆ ప్రశాంతత కూర్చుని అనుభవించాలి . 

మ్య్యుజియం మూసేస్తారని అటు వెళ్ళాము . టికెట్టు తెచ్చుకోడానికే పది నిమిషాలు పట్టింది . బాగులు బయటే ఇచ్చేసి లొపలకి వెళ్ళాము . చాలా ఉంది చూడడానికి . గబ గబ నాలుగు గదులు చుట్టేసాము . ముందు ఆకర్షణ original నాలుగు సింహాల స్తూపం . చరిత్ర విద్యార్థులకి ఒక పండుగ . మళ్ళీ మూసేస్తారని అశోకా స్తూపానికి వెళ్ళాము . 

అక్కడ చాలా నడక ఉంది . పాపం అప్పటికే భార్గవికి , నిమ్మికి పాదాలు వాచి ఇబ్బంది పెడుతున్నాయి . వారిని అక్కడ కూర్చొమని నేను ప్రసాద్ గారు లోపలకి వెళ్ళాము . 

  అది ధమేక స్తూపం . మొదట క్రీ . పూ .249 లో అశొకడు కట్టించిన ఆ స్థూపానికి క్రీ . పూ .500 లో మొదటి కట్టిన స్థూపం మెరుగు పరచడమే అని ఆధారాలు చెపుతున్నాయి . అక్కడ ఒక మహా చైతన్యం ఉండేదిట . దాదాపు 1500 మంది బౌద్ధులు అక్కడ నివాస ముండేవారని విదేశీ యాత్రికుని xuanchang రాతలలో ఉంది . ఇప్పుడు ఆ అవశేషాలు ఉన్నాయి . ఎంత ప్రశాంతత ! ఆ స్థూపం పరిక్రమ చేస్తే -- ఇది ఎలా కట్టగలిగారా అని ఆశ్చర్యం కలుగుతుంది . అదీ అలా గబగబా చూడాల్సిన ప్రదేశం కాదు . అక్కడ ఒకామె బయట నిల్చుని అడిగారు -- ఏమండి ఆ స్థూపం లోపల ఏమైనా ఉందా ? మా గైడ్ అక్కడ ఏమి ఉండదు రాళ్ళు రప్పలు తప్ప అన్నాడు .నేను ' మన ఆసక్తిని బట్టీ ఉంటుంది . స్థూపం లో లోపల ఏమీ లేదు . వెళ్ళే మార్గమూ లేదు . అన్నాను . 

    ఇక టైం అయ్యిందని బయటకు వచ్చాము . కానీ మళ్ళీ వెళ్ళాలి . అప్పటికి అందరం అలిసిపోయి వెనక్కి వెళ్ళాము . 

Friday, April 22, 2022

Emotions recollected in tranquility-6

 కాశీ యాత్ర -౬

శంభో మహాదేవ ! హర హర శంకరా ! 

పొద్దున్నే నాలుగింటికి లేచి రెడీ అయ్యి నాలుగున్నరకల్లా విశ్వనాధ గుడికి చేరాము . ముందే దిలీప్ ఏర్పాటు చేసినట్లు ఒక షాప్ దగ్గర దింపాడు . గుడి కి దగ్గరగా ఉంది . అక్కడ మా బాగులు , ఫోనులు అన్నీ డిపాజిట్ చేసాము . లోపల పూజకు కావల్సిన పూల తట్ట ఇచ్చారు . టికెట్ కి ఒక వంద రూపాయులు కలిపి తీసుకున్నారు . అంటే మనం టికెట్ ఆన్ లైన్ లో తీసుకోవచ్చు . 350/- . అయితే అది ఒక రెండు రోజులు ముందే ఇస్తారు . మరీ ముందు దొరకవు , ఆలస్యంగానూ దొరకవు . మేము అది చెయ్యలేదు కనుక ఒక వంద రూపాయులు ఎక్కువ . ఇక అక్కడ నుంచి ఒక పుజారి కి అప్పజెప్పారు . ఆయనకి కొంచం తెలుగు వచ్చు . అన్నట్లు డబ్బులు ఉన్న పర్సు దగ్గర పెట్టుకోవాలి . ఇంక గుడిలోకి వెళ్ళిన దగ్గర నుండి ఆ పూజారి ' అమ్మా , కొంగులు కప్పుకొండి , మీ గొలుసులు లాగేస్తారు , పర్సులు జాగ్రత్తా ' అంటూ హెచ్చరిస్తూనే వున్నాడు . అదే తెలిసి వుంటే గొలుసులు లేకుండానే వెళ్ళే వాళ్ళం కదా అనుకున్నాము . పక్కన ఎవరు అన్న టెన్షన్ ఉండదు . 

ఇక అక్కడ ఉన్న మరో పూజారికి అప్పజెప్పాడు . అతను మీరు ఎన్ని లీటర్లు అభిషేకం ? ఒకటా ? అయిదా ? అని . నేను ఏమీ ఆలొచించకుండా అయిదు అన్నాను . అయిదు లీటర్లు పాలు . ఎక్కడో చదివాను -- ఆ శివుడికి పాల తో అభిషేకం చేస్తే మంచి గొంతు వచ్చి చక్కగా పాడగలుగుతారుట ! నాకు తీరని కోరికలలో అది ఒకటి . హాయిగా నాకు నచ్చేలా పాడుకోవడం . అందుకే ఏమి తడుముకోకుండా అయిదు అన్నాను . ఇవన్ని ఏక పక్ష నిర్ణయాలు . పక్కనే ఉన్న ప్రసాద్ గారిని , భార్గవిని అడగలేదు . పాపం , వారు ఏమీ మాట్లాడలేదు . పాలకి డబ్బులు . అక్కడ నుండి మొదలు -- అన్నీ అయిదు వందల కాగితాలే తీయడం , ఇవ్వడం .

గుడి చాలా బాగుంది . మోడి , యోగి గారి ప్రభుత్వ నేతృత్వం లో విశ్వనాధ కారిడార్ అని ఆ గుడిని విశాలం గా చేసారు . అంతకు ముందు ఒక సారి వచ్చిన ప్రసాద్ గారు చాలా మారిపోయింది అని చెప్పారు . అదీ కాలభైరవుని గుడిలాగా చిన్నదిగా ఉండేదిట . నేను చదివిన అన్ని పుస్తకాలలో అలాగే రాసి ఉంది . పక్కనే గోడ కి ఆనుకుని పెద్ద mosque ఉండేదిట . ఇప్పుడు ఆ మసీదుకి గుడి కీ దూరం ఉంది . విశాలంగా , తెల్లవారు జామున ప్రశాంతతో చాలా హాయిగా ఉంది . అప్పటికే జనం ఉన్నారు . అసలు లింగం పక్కన చిన్న మండపం లో నాలుగు లింగాలు వరుసగా ఉన్నాయి . అభిషేకం చేసేది వాటికి . ముందు కూర్చుని వారిది అయిపోగానే మేము కూర్చున్నాము . 

బకెట్ నిండా పాలు కలిపిన నీళ్ళూ , గంధం , తేనే , విభూది , ఇలా అన్ని చిన్న పాత్రలతో పట్టుకు వచ్చి అభిషేకం చెయ్యించారు . చాలా తృప్తిగా అనిపించింది . నాకైతే అదే విశ్వనాధుడు ! అసలు మూల విరాట్టు దూరం నుంచి చూడడమే కదా ! ఈయనకే విశ్వనాధుడని మనసార నమస్కారం చేసుకున్నాము . అక్కడి వారు చిన్న చెంబులలో నీరు తెచ్చి అలా కొంచం ఆ నాలుగు లింగాల మీద పోసి హర హరా అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దేవాలయం అంతా విశ్వనాధుడే .పూజ అవగానే మాకు చేతికి కాశీ దారం కట్టాడు . కాశీ దారం మాకు తెలిసి నల్లగా ఉంటుంది కదా ! ఈయన ఎర్ర దారం కట్టాడు . రూల్స్ మారి పోయాయేమో !


అక్కడ నుంచి విశ్వనాధ దర్శనం . ఇక్కడ మాకు పక్క నుంచి క్యూ లో కలిపి పంపారు . ఇదేదో మా మీద అభిమానం కాదండి . ఒక్కో గ్రూప్ కి ఇంత టైం అని పెట్టుకుంటారు . ఆ టైం లో గబాగబా చూపించి బయటకు తీసుకుని వెళ్తేనే వారికి ఉపయోగం . వారి నెట్ వర్క్ అక్కడున్న పూజారులతోను , పోలీసులతోనూ ఉంటుంది . అదే వారి సంపాదన మార్గం .

  దర్శనం చేసుకుని ఆ పక్కకు వెళితే వినాయకుడు . మమ్మల్ని లోపలకి తీసుకుని వెళ్ళిన పూజారికి ఒకటే మంత్రం వచ్చు . ( అని మేము అనుకున్నాము ). అది చదివి వినాయకుడి దణ్ణం పెట్టించి అక్కడ తీర్థం తీసుకోని ఆ బ్రాహ్మడుకి వంద రూపాయులు ఇమ్మన్నాడు .

అక్కడ ఒక బావి ఉంది . ముందు ఉన్న లింగం ఔరంగ జేబ్ దాడి చేసి నప్పుడు ఒక పూజారి అది బావి లో పడేసారుట . అది లుప్త మయిపోయింది . అక్కడ నంది అటు వేపు తిరిగి వుంటాడు . ఎందుకంటే పూర్వమున్న లింగం అక్కడ ఉండేది . ఇప్పుడు అక్కడ ఒక మసీదు ఉంది . 

నిజానికి ఈ గుడి చాలా సార్లు దాడికి గురి అయ్యింది . 1194 లో కుతుబుద్దిన్ ఐబక్ , నాశనం చేసిన గుడిని Iltutmush కాలంలో ఒక గుజరాతి వర్తకుడు తిరిగి కట్టారు . మళ్ళీ శికందర్ లోడి దాడి చేసారు . 1585 లో రాజ్ మాన్ సింగ్ అది ముందు ఉన్న ప్రదేశం లో కడితే పూజారులు అందులోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదుట . ఎందుకంటే మాన్ సింగ్ కూతురు ఒక ముస్లిం ని పెళ్ళి చేసుకుందని . మళ్ళీజహంగీర్ కాలంలో తిరిగి కట్టారు . 1669 లొ ఔరంగ జేబ్ గ్యాన్ వాపి మసీదు కట్టడం తో మరో సారి దాడికి గురి అయ్యింది . అప్పుడే ఆ లింగాన్ని బావిలో పడేయడం . 

ఇప్పుడు ఉన్న గుడి తరువాత ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్  1780 లో కట్టించారు .ఆ శివ లింగం కూడా ఇండోర్ నుండి తెచ్చారుట . భారత దేశం లోని చిన్నా , పెద్దా రాజులు అందరూ ఈ గుడి కోసం విరాళాలు ఇచ్చారుట .

కాని మనకి ఆ శివుడు ఎప్పటినుండో ఉన్న ఆది శంకరుడే . ఆ భావనే దాన్ని జ్యోతిర్లింగం చేసింది . 

 అక్కడ నుండి వెనక వైపుగా విశాలాక్షి గుడికి తీసుకుని వెళ్ళాడు . మీరు బయటకు వెళ్ళి ఈ గుడికి రావలంటే అరగంట పడుతుంది అని వారికే తెలిసిన సందుల్లో నుంచి తీసుకుని వెళ్ళాడు . 

మనకు దక్షిణ భారతం లో అయ్య వారికి ఎంత ప్రాముఖ్యత ఉందో అమ్మ వారికి ఒక ఆకు ఎక్కువే ! అమ్మలగన్న అమ్మ కదా ! ఇక్కడ అలా కాదు . అదో చిన్న ఇల్లు లా ఉంది . పాత కాలం చువ్వలుండే తలుపులున్న ఇల్లు . లోపలకి వెళితే అమ్మ వారు . మా పేరు మీద పూజ చెయ్యించి జాకెట్టు ముక్కలు , గాజులు ఇప్పించాడు . 

  అక్కడ నుండి చక చకా నడిపించుకుంటూ అన్న పూర్ణ దేవాలయం కి వెళ్ళాము . కాశీ అన్నపూర్ణ ! దణ్ణం పెట్టుకుని బియ్యం ప్రసాదం తీసుకున్నాము . నిజానికి అక్కడ ఒక పూట భో జనం అనుకున్నాము కాని మళ్ళీ అక్కడకి రావడం కష్టం అని అర్థం అయ్యింది . రమా శాండిల్యా గారు అన్నట్లు ఆ పక్కన ఉన్న లాడ్జీలలో ఉంటేనే అది సాధ్యం . ప్రాప్తం లేదు .

అన్ని చూసి బయటకు వచ్చి తిరిగి ఆ షాప్ కివచ్చి టైం చూసుకుంటే ఏడు . అప్పటికి గుడి దగ్గర జనం కూడా ఎక్కువ అయ్యారు .మమ్మల్ని లోపలకు తీసుకుని వెళ్ళిన పూజరి 10000/- నుండి మొదలు పెట్టి 2500/- సరి పెట్టుకుని వెళ్ళాడు . అక్కడ ఒక చిన్న శివలింగం కొన్నాను . మాకు తెలిసిన వారు అడిగారు . ఇంకా ఏమైనా కొందామని అన్నా అన్ని స్పెన్సర్ రేట్లు . దిలీప్ అప్పటికి ఆ పూజరితో గొడవ పడ్డాడు . వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి కాని అలా డిమాండ్ చెయ్యడమేమిటి అని . అతనంతే ప్రశాంతంగా నా సంపాదన ఇదే కదా అంటు వేరే పార్టిని గుడికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం లో పడ్డాడు . 

మేము మెల్లగా బయట పడ్డాము . అక్కడే ఆ కారు దిగుతూ ఉంటేనే నిమ్మి కాలు మెలి దిరిగి స్ప్రైన్ అయ్యింది . తను ఏమి చెప్ప లేదు . తరువాత దాని ప్రభావం తెలిసింది . రూం కి చేరే సరికి పాదం వాచింది . 

మళ్ళీ హోటల్ కి చేరి కాస్త తిని రెస్టు తీసుకుని షాపింగ్ కి వెళ్ళాము . అదే ఆ పొద్దు సరిపోయింది . సాయం కాలం నాలిగింటికి సారనాధ్ అనుకున్నాము . ఈ లోపు ఇక్కడి భోజనం చెయ్యాలని అనుకున్నాము . చిన వీరభద్రుడి గారి పుస్తకం లో రాసారు - బాటి చోకా కి వెళ్ళాము . కింద కూర్చో గలిగే వారికి కిందా లేదంటే కుర్చీలు వేస్తారు , విస్తరాకులో భోజనం , చోకా అంటే మన బోండాం లా ఉంది . దానితో వంకాయ బజ్జి , పల్చటి పప్పు , గట్టి పెరుగు , పుదినా పచ్చడితో అన్నం . దానితో ఖీర్ . భోజనం బాగుంది . ఒకటి కంటే ఎక్కువ తినలేము . ambience చాలా బాగుంది . జనం అలా వస్తూనే ఉన్నారు . అది తిని ప్రసాద్ గారు తెచ్చిన బనారస్ పాన్ వేసుకుని రూం చేరాము . 

రజనీ ఒక నివాళి

 పొద్దున్నుంచి పరంపరగా వస్తున్న నివాళులు మనస్సు కి తృప్తి నిచ్చాయి . రజని గారు పోయి ఇవ్వాళ్టికి నాలుగు సంవత్సరాలు .

 అఫ్సర్ గారు తన నివాళి లో రాసినట్లు భావ గీతాల తుఫాను లో కూడా తన స్వరం వినిపించగలిగారు రజని . అతి పిన్న వయస్సు నుండి పాటలు రాసారు రజని . అవి వుత్తి మాటల మాలలు కాదు . భావాల లోతులున్నాయి . ప్రతి భావాన్ని ఒక చిత్రం లా మన ముందు ఉంచారు . ఈ దృశ్యం ఆయన్ని కదలించింది అని పక్కన ఉన్న మనకు తెలియదు , పాటైతే తప్ప . 

మధ్యలో ఆయన పూషా పేరుతో రాసిన కవితలు చాలా వేరుగా వుంటాయి . నేను అడిగాను -- మీరు ఇలాగే రాసి వుంటే ఈ తరానికి ఇంకా ఎక్కువ మందికి తెలిసే వారేమో ! అని . ఆయన అది నా స్వభావానికి సరిపోదు . నేనూ రాయగలను అని నాకు నేను చెప్పుకోవడానికే . అందుకే మానేసాను అన్నారు . 

ఇక ఆయన స్ఫృశించని పాటల ప్రక్రియ లేదు . లాలి పాటలు , చిన్న పిల్లల పాటలు , నృత్య గీతాలు , సినిమా గీతాలు , అనువాదాలు లలిత సంగీతం అన్నీ ప్రక్రియలలో తనదైన ముద్ర వేసారు . కాని అన్నిటి కంటే నాటకీయత పాటలలో ఆయనకి ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తుంది .నృత్య గీతాలు , కూచిపూడి నృత్య నాటకాలు ఆయనకి చాలా ఇష్టమైన ప్రక్రియ. ఆయన వాద్య బృందాలలో కూడా కనిపించేది అదే . అది ఆది కావ్యావతరణ అయినా ,మాటలతో పాటలతో పిల్లల కోసం రాసిన కొండ నుండి కడలి దాకా అయినా , సంస్కృతం లో రాసిన మేఘ సందేశం అయినా అదే నాటకీయత కనపడుతుంది .అంతెందుకు -- ఒహో ఒహో ప్రతి శ్రుతి అనే పాటలో ' ఒంటరైన బాటసారి ఓ యన ఒహొ యన ' అదే నాటకీయత కనపడుతుంది . పద చిత్రాలు , నాటకీయత , సంగీతం ఆయన పాటని మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తాయి . 

 రజనీ ఛాందసులు కాదు . అలా అని మన సంస్కృతి మీద అపారమైన ప్రేమ ఉన్నవారు . దేముడి మీద భక్తి ఉంది . ఏ మాత్రమూ భయం లేదు . అందుకే పూజ చెయ్యక పొతే ఎలా అని ఒక ritual కి కట్టుబడరు . శ్రీ కృష్ణం శరణం మమ రాస్తున్నప్పుడు ఆయన భగవద్గీత ఎలా పాటలో పెడతారా చూడాలని చాలా ఆసక్తి ఉండేది . ఆయన అవి రాసిన పది రోజులు శ్రీ కృష్ణ నామం జపం చేసారు , స్నానం చేసి , మంచం మీద కూర్చుని తన మనస్సంతా ఆ రూపం పై లగ్నం చేసారు . మనం చూస్తే కూర్చుని నిద్ర పోతున్నరని అనుకుంటాము . వచ్చిన వారితో మాములుగా మాట్లాడేవారు . అది రాయడం అయి పోయాక నేను ఎలా సాధ్య పడింది అంటే పై విషయం చెప్పారు . అయితే సంగీతం ఆయనది కాదు , నృత్యం గీతం కనుక ఆ భగవద్ గీత లోని అందం , సంపూర్ణత్వం మనకి విడిగా తెలియదు .

ఆయన పాట మాట వేరుగా రావు . అందుకే ఆయన సాహిత్యానికి ఆయన సంగీతమే మాకు నచ్చుతుంది . అలా అని అది ఆయన సొంతం అనుకోరు . ఉదాహరణకు రావు బాలసరస్వతి గారు పాడిన ' విరహానలంపు బాధ అది వారి ట్యూన్ . నాకు ఇదారి ట్యూన్ వినే మహదవకాశం దొరికింది . అది ఇక మళ్ళీ ఎవరికీ , ఎప్పుడూ సాధ్యపడదేమో . అప్పుడు ఈ స్మార్ట్ ఫోనులు లేవు , వరే పరికరాలూ లేవు . ఇక సూరి బాబు గారు చేసిన ' హాయిలో నేల ఎద కింత హింసా ' . నేను వారిని వారి ట్యూన్ అడిగాను . ఇది విన్నాక అది మర్చి పోయాను అన్నారు . సుధాకర్ గరు చేసిన నును మంచు సోనలో ' ఇవన్ని చాలా బాగుంటాయి . అది రజనీ గారు విని సంతోషించేవారే కాని నాపాట నా బాణి అని అనుకునే వారు కాదు . మరో మధురమైన పాట ' పృధయా సాంధ్య సమీర లాస్యం ' మంచాల జగన్నాధ రావు గారి  సంగీతం , పి. బి. శ్రీనివాస్ గారి గొంతులో ! ఎన్ని పాటలో ఎన్ని పాటలో చాలా పాటలు నాకు తెలియనవి వున్నాయి . ఎవరైన చెపితే విని చాలా సంతోషిస్తాను . ఆయన 17-18 ఏట మొదలు పెట్టి దాదాపు 80 ల దాక రాసారు . ఎన్ని పాటలు ఉండి వుంటాయి ! 

వారి సున్నితమైన పరిశీలన శక్తి , కొత్తదనాన్ని ఆహ్వానించడం , ఒప్పుకోవడం , ఆనిందచడం , అందరిని ఒకేలా చూడడం ఆయన్ని ఒక మహా మనీషిని చేసాయి . ఏదైనా విషయం గురించి మాట్లాడుతూ వుంటే అది అప్పుడు ఆయన బుర్రలో తిరుగుతున్న విషయం . దాని గురించి ఒక కొలిక్కి వచ్చేదాక అదే మాట్లడాతారు . ఆయన్ని దాని ఒప్పుకోమని కాదు, మన తో చర్చిస్తున్నారు . అందులో లోపం వుంది అంటే సర్దుకుంటారు . అలా చెప్పాలి అంటే భట్టు గారో V.A.K . రంగారావు గారో అయ్యి  వుండాలి . ఆయనకి  చివరిలో  కలిగిన  అసంతృప్తులలో అది ఒకటి . ఆయన భాష అర్థం చేసుకునే వారే తగ్గి పోయారు . రవి కృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఆయన గొంతులో ఆనందం . పరచూరి శ్రీనివాస్ గారంటే విపరీతమైన అభిమానం . పారనంది గారంటే ఎంతో ఇష్టం . ఆయన ఎవరి నిస్కృమణ అయినా సమదృష్టి తో స్వీకరించారు . నేను ముగ్గురు వ్యక్తులు పోయినప్పుడు ఏడవడం చూసాను - మా అత్తగారు , అంతకు ముందు ఉషశ్రీ గారు , ఆ తరువాత బాలమురళి గారు. ఆ రోజంతా ఆయన్ని వదిలి పెట్టలేదు . నాకు ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ  . ఆయన మీద భక్తే తప్ప విషయ పరిజ్ఞానం లేదు . అయినా చెప్ప వల్సింది చాలా వుంది అనిపిస్తోంది . ఆయన మాకు ఇచ్చిన ఆస్తే ఆయన కృషి వల్ల సంపాదించిన పేరు ప్రతిష్టలు . అవి ఎక్జడకు వెళ్ళినా మాకుదీవెనెలు గా వుంటాయి . 

Emotions recollected in tranquility-5

 కాశీ యాత్ర -5 

మచలతీ హుయీ హవా మే చంచం 

హమారే సంగ్ సంగ్ చలే గంగా కి లెహరే .

జమానే సే కహో అకెలే నహి హం 

హమారే సంగ్ సంగ్ చలే గంగా కి లెహరే .

గంగ మన జీవితం లో ఒక ముఖ్య భాగం . గంగ గోదావారి ని కూడా చూసాము మా కృష్ణ గంగ తో పాటు . ఇప్పుడు నిజంగా గంగని చూస్తున్నాము . ఆ ఉత్సాహంతో బయలు దేరాము . అసలు కాశీ లో దిగిన దగ్గరనుండి భార్గవి గంగ అంటూనే ఉంది . ఈ సారి ఏమనుకున్నాడో ఏమో దిలిప్ మాతో వచ్చాడు . ఆయన రాకపొతే దారి కనుక్కోవచ్చు కాని కొంచం కంగారుగా ఉండేది . మమ్మల్ని కేదార్ ఘాట్ కి తీసుకుని వెళ్ళాడు . చిన్న సందుల్లోంచి నడిచి వెళ్ళాము . ఒక చోట ఎవరింటి వాకిట్లోకో వెడుతున్నట్టు చిన్న నడవా . అందులో కొంతమంది సాధు వేష ధారులు పక్కలు పరుచుకుని పడుకుని ఉన్నారు . వారి ప్రపంచం వారిది . పక్కన నడుస్తున్న వారికేసి కూడా చూడటం లేదు . వారికున్న కొద్ది పాటి వస్తువులు మూటలు గా కట్టి కనపడుతున్నాయి . అవి దాటి ముందుకు వెడితే గంగ . అయితే గంగ ని చేరడానికి బోలేడు మెట్లు . అవి కూడా బాగా ఎత్తు . అది చూడగానే నిమ్మి , భార్గవి నీరసపడ్డారు . ఇద్దరికి కాళ్ళు నొప్పులు . ముఖ్యంగా మోకాలు . సరే తప్పదుగా మెల్లగా వెళ్దామని ఒకరికొకరం సాయం చేసుకుంటూ దిగాము . దిగే ముందు దీపాలు , పూలు ఉన్న చిన్న తట్టలు అమ్ముతున్నారు తల్లీ పిల్లలు . మమ్మల్ని చూడగానే తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టారు . ముందు నేను వీరికి ఎట్లా తెలిసిందా అనుకున్నాను . తరువాత అనిపించింది -- మేము ఒకరితోఒకరం తెలుగులో కదా మాట్లాడుతుంటా అని . సరే అవి కొనుక్కుని మెల్లగా మెట్లు దిగి నావ మాట్లాడే పని దిలీప్ కి అప్పగించాము . 

అక్కడ మాములు సరంగులు నడిపే నావలు , మోటారు బోట్లు , luxury boats కూడా ఉన్నాయి . మనకి విడిగా మాట్లాడుకోవచ్చు , లేదా common పడవలు కూడా ఉన్నాయి . మేము మా వరుకే అని మాట్లాడుకున్నాము . మాములు పడవ అని నేనే అనేసాను . నాకు ఆ పడవ నడుపుతూ ఉండే తెడ్డు చప్పుడు బాగుంటుంది . నిదానం గా వెళ్ళచ్చు , మోటార్ శబ్దం ఉండదు అని ఉద్దేశం . బేరమాడి అక్కడనుండి మణికర్ణికా ఘాట్ దాక తీసుకుని వెళ్ళేటట్లు , ఆరతి చూపించేటట్లు బేరమాడుకుని బయలుదేరాము . మన మనస్సే అన్ని అనుభూతులకి మూలం కదా ! ఇన్నాళ్ళు విని విని ఉన్న గంగా నదిలో వెళ్తున్నాము అనే వాస్తవం ఆనందానిచ్చింది. 

  గంగా నదీ తీరం అంతా 80 ఘాట్లు దాకా ఉన్నాయిట . అందులో రాణీ ఘాట్ , ఇండొర్ రాణి గారు కట్టించింది , రాజ మాన్ సింఘ్ ఘాట్ ఉన్నాయి . మీరబాయి ఘాట్ దగ్గర ఆమె విధవ స్త్రీల కొరకు ఒక ఆశ్రమము కట్టించిందిట . ఇప్పుడు ఆ ఆశ్రమమూ మారి పోయింది . నారద ఘాట్ లో ఎవరూ జంట గా వచ్చి స్నానం చెయ్యరుట .ఆ జంట అనదమ్ములైనా , తండ్రి కొడుకులైనా , స్నేహితులైనా గొడవలు పడి విడి పోతారుట . నారదుడు కలహ ప్రియుడు కదా ! 

ఇక హరిశ్చంద్ర ఘాట్ అందరికి తెలుసు . ఎక్కువుగా శవ దహనం జరిగే ఘాట్ . దశాశ్వమేధా ఘాట్ . ఇక్కడే ప్రతి రోజు గంగా ఆరతి జరుగుతుంది . మున్షీ ప్రేమచంద్ ఘాట్ . కాశీ వాసులు ఆయన్ని ఎంతలా గౌరవించారో తెలిసి ఆనందించాను . ఆ ఘాట్ లో నే మెట్ల మీద కూర్చునే వారుట , అక్కడే రాసుకునే వారుట . అందుకని ఆ ఘాట్ కి ఆయన పేరు . అలా ఒక్కో ఘాట్ చూపించుకుంటూ మణి కర్ణికా చేరాము . ఎంత వద్దు అనుకున్నా వేదాంతం కలుగుతుంది . 360 రోజులు, 24 గంటలు ఎవరిదో ఒకరిది దహనం జరుగుతూనే ఉంటుంది . కాశీ మహా స్మశానం . కాశి జీవన క్షేత్రం. జీవితాన్ని , మృత్యువుని ఒకేలా చూడగలిగే శక్తి నిచ్చే క్షేత్రం ! ఇక్కడకు వచ్చాక హాయిగా పొతే పుణ్యం అనుకుంటూ మరణాన్ని కూడా భయపడకుండా ఆహ్వానించగలిగే ఊరు . అది నిజమా ? మనం కలిపించుకునే ఊహా ? అంటే ఊహే కదా వాస్తవం అయ్యేది . ఇక్కడ యమధర్మ రాజు కాదు మృత్యువుని ప్రసాదించేది , సాక్షాత్తు ఆ పరమ శివుడు . 

మణికర్ణిక నుండి దేవాలయానికి ఒక పెద్ద రాంప్ , మంచి తోవ తయారవుతోంది . గంగ లో స్నానం చేసి , ఎంత ముసలి వారైనా , మెల్లగా ఆ విశ్వనాధ దర్శనం చేసుకోవచ్చు . మేము వెళ్ళినప్పుడు మణికర్ణికా లో ఏడు శవ దహనాలు జరుగుతున్నాయి . అర్థరాత్రి 12 తరువాత శవం , అది ఎవరిదైనా సరే , బూడిద స్వామి కి తీసుకుని వెళ్ళి అభిషేకిస్తారుట ! హరిశ్చంద్ర ఘాట్ లో రెండో , మూడో ఉన్నాయి . ఇది వరకు చదివినట్లు సగం కాలిన శవాలు , మురికి -- ఇవి లేవు . గంగ శుభ్రంగా ఉంది . అయితే నీరు మంచిదేనా అంటే చెప్పలేము . కలుషితాలు , ముఖ్యంగా tanneries లో ని రసాయనక కలుషితాలు ఇప్పటి కీ కలుస్తూనే ఉన్నాయి .

అందుకే గంగ నీరు నెత్తి మీద జల్లుకోవడమే . ఇక అక్కడ నుంచి మెల్లగా వెనక్కి దశశ్వమేధ దగ్గరకు వచ్చేసరికి వలయాలుగా పడవలు . వాటి మధ్యలో మాదీ చేర్చాడు . మనకి భయంగా ఉంటుంది కాని వారు అలవాటుగా ఒకే టీం లా ఒక దాన్ని ఆనించి ఒకటి పెట్టారు . కొంచం సేపు భయం కలిగినా తరువాత వారి ధైర్యం మాకు ధైర్యం వచ్చింది . ఇంక విన్యాసాలతో ఆ సాయం సంధ్య గంగా ఆరతి చూడడం ఒక అనుభవం . అది చివరికి వచ్చాక మేము కూడా దీపాలు వెలిగించి గంగ లో వదిలాము . అంతా చూసి మెల్లగా కేదార్ ఘాట్ చేరాము . మళ్ళీ ఆ మెట్లు . ఆ పైన కేదారేశ్వరుని గుడి . అక్కడ కొంత మంది భక్తులు భజనలు చేస్తున్నారు . అది చూసుకుని మెల్లగా బయట పడ్డాము . అక్కడ ఒక లెమన్ టీ తాగాము . కొంచం మసాల కలిపి వేడిగా ఉన్న టీ భలే రుచిగా ఉంది . కాశీ లో జనం అంటే అక్కడే చూసాము . గుద్దుకోకుండా బళ్ళు ఎలా వెడుతున్నాయో నాకైతే అర్థం కాలేదు . ఇక ఎన్ని రకాల మనుష్యులో ! ఎన్ని భాషలు వినపడుతున్నాయో ! సౌత్ నుంచి చాలా మంది వచ్చారు ఈ నాలుగు రోజుల్లో అని సమాచారం అందించాడు దిలీప్ . అందరూ మా లాగా నాలుగు రోజులు ఉందామని వచ్చిన వారే కదా ! 

హోటల్ కి చేరి మర్నాడు పొద్దున్నే నాలిగింటికి విశ్వనాధ దర్శనం అని అనుకున్నాము . మా అబ్బాయి ఒక్క రోజులు ఇన్ని చూసారా ? అసలు కారు దిగారా ? అందులో నుంచే చూసి అయ్యింది అనేసుకుంటున్నారా అని వేళాకోళం చేసాడు . కాని మేము ఎంతో తాపిగా , హడావిడి లేకుండా చూసాము . 

Wednesday, April 20, 2022

Emotions recollected in tranquility-4

 కాశీ యాత్ర -4 

తొమ్మిదీ తొమ్మిదిన్నరకి బయలుదేరిన మేము ముందు తులసీదాస్ మానస మందిర్ కి వెళ్ళాము . ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే పదహారో శతాబ్దం లో తులసీదాస్ ఇక్కడ తన రామచరిత మానస్ రాసారని . అందుకే మందిరానికి ఆ పేరు . అయితే ఈ మందిరం 1964 లో కట్టారుట . పూర్తిగా పాలారాయి తో కట్టబడి ఉంది . గోడల మీద రామచరిత మానస్ చెక్కబడి ఉంది . లోపల హనుమత్ లక్ష్మణ సీతా సమేత రామచంద్ర మూర్తి ఉన్నారు . పైన పురాణాలలోని కొన్ని ఘట్టాలు బొమ్మలు ఉన్నాయి . దానికి టికెట్ . లోపల తులసి దాస్ విగ్రహం కూడా ఉంది . మన దక్షిణ భారతం లోని విగ్రహాలకి ఉత్తర భారతం లో విగ్రహాలకి చాలా తేడా . 

జనం లేరు . పది పదిహేను నిమిషాల లో బయట పడి సంకట విమోచన హనుమాన్ మందిరం కి బయలుదేరాము . ఇది తులసిదాసు కట్టారని ప్రతీతి . ఇక్కడ హనుమంతునికి దణ్ణం పెట్టుకుని ఆయన రామచరిత మానస్ మొదలు పెట్టారుట . ఇక్కడ ఒక వైపు రామ లక్ష్మణుల గుడి , ఎదురుగా ఈ హనుమంతుని గుడి . టికెట్లు లేవు కాని బాగా చెకింగ్ జరిగింది . లోపలికి ఏది తీసుకుని వెళ్ళనివ్వరు . దీనికి కారణం 2006 లో జరిగిన బాంబ్ పేలుడు . అదృష్టవశాత్తు ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు . మర్నాటి నుండి మాములుగా భక్తులు వచ్చేసారు . అక్కడవారు ఇక్కడ బాంబ్ పేలలేదు ముందుగానే కనుక్కున్నారు అన్నారు . అక్కడ క్య్యులో దర్శనం చేసుకుని అక్కడ పూజరిని ఈ విగ్రహం గురించి తెలుసుకోవల్సింది ఏమైనా ఉందా అని అడిగితే ఇది స్వయం భూ . నీకైదైనా కోరిక ఉంటే వెళ్ళి అడుగు స్వామి తీరుస్తాడు అన్నాడు . ఏ కోరిక లేక పోతే అంటే ' నీకేమి అవసరమో అది ఇస్తాడు ' అన్నాడు . ఇంతలో అక్కడికి వచ్చిన ఒక భక్తుడు , వయస్సులో 25-30 వుంటాయి -" ఆంటిజీ , మీరు ఎక్కడో నుంచి వచ్చినట్లు తెలుస్తోంది . ఆ స్వామి పిలవకపోతే మీరు ఆయన్ని చూడలేరు . అది నా స్వానుభవం ' అని ఎంతో భక్తి గా చెప్పాడు . పూజారి గారు ప్రసాదం ఇచ్చారు . అక్కడ కోరికలు తీరడానికి నూలు తాడు అక్కడ ఉన్న చెట్టుకి కట్టి ఉన్నాయి ( పురికోస). చాలా మంది అక్కడ కూర్చుని చాలీస చదువుతున్నారు .అటునుంచి రాములు వారి దర్శనం చేసుకుని మళ్ళీ క్యూలో నిల్చోని ఇంకో సారి స్వామి దర్శనం చేసుకుని బయట పడ్డాము . అక్కడ నుండి BHU దగ్గరని అటు వెళ్ళి అక్కడ ఉన్న బిర్లా మందిర్ , కాశీ విశ్వేశ్వరాలయం కి వెళ్ళాము . 

ఆ ఆలయం విశాలంగా అందంగా ఉంది . మనం లోపలికి వెళ్ళి లింగాన్ని ముట్టుకోవచ్చు . అక్కడ ఆ ఆలయం ఎదురుగా మదన మోహాన్ మాలవ్య విగ్రహం ఉంది . ఆ విశ్వ విద్యాలయం అంతా ఆయన ప్రేరణ . యూనివెర్సిటీ బయట కూడా ఆయన విగ్రహం ఉంది . లోపలకి వెళ్ళగానే మంచి  సంగీతము వినపడి ఆ స్వరం వెతుక్కుంటూ మొదటి అంతస్థుకి వెళ్ళాను . అక్కడ శివుని విగ్రహం ముందు కూర్చుని ఒక యువకుడు పాడాడు . అప్పుడే పూర్తి అయ్యినట్లుంది . నేను వెళ్ళి బిస్మిల్ల ఖాన్ గారి ఇల్లు ఎక్కడ అని అడిగితే అడ్రెస్సు చెప్పాడు . ఆటో లో వెళ్ళండి అని కూడా. సలహా ఇచ్చాడు . 

  గుడి బయట పుస్తకాల షాప్ కనిపించగానే వెళ్ళడం దారిలో చదువుకోవడానికి ఒకటి తరువాత చదవడానికి రెండూ కొని తెలుగు డిపార్ట్మెంట్ కొసం బయలుదేరాము . ఎవరూ చెప్పలేకపోతే మాధవరావు గారికి ఫోన్ చేసాము . ఆయన సూచనలతో మెల్లగా చేరాము . బూదాటి వేంకటేశ్వరులు గారు HOD. వారిని , అక్కడ ఎన్నొ సంవత్సరాలుగా ఉన్న గుంటూర్ వాస్తవ్యులు భారతులశారద గారిని , కథానికలలో సరస్వతి గురించి పరిశొధన చేస్తున్న విద్యార్థిని కలిసాము . చల్లటి వారణాసి లస్సీ తాగించారు . ఆ చోట ఎంత మంది మహామహులు తెలుగు వారు చదువుకున్నారో గుర్తు చేసుకున్నాము . 1940-50 లలో ఆంధ్ర మహిళా సభ నుండి స్త్రీలకు మెట్రిక్ పరీక్ష రాయించడానికి మా పెద్ద మామగారు వచ్చేవారు . అప్పుడు స్కూల్ చదువు వరుసగా లేకుంటే బెనారస్ మెట్రిక్ రాయడమే . ఇక పద్మరాజు గారు , కొడవటిగంటి కుటుంబరావు గారు , మొదలైన వారు చదివిన ప్రదేశం . కబుర్లు , ఫొటొలు అయ్యాక దుర్గా దేవి గుడికి వెళ్ళాము . ఎర్రటి ఎండ . చెమటలు లేవు కాని శరీరం మాడ్చేసే ఎండ . ఆ గుడి చూపడానికి ప్రసాద్ గారి కోడలు స్నేహితులు వచ్చారు . పది నిమిషాలలో దర్శనం అయ్యింది . పొద్దున కాలభైరవుడి దగ్గర మిస్ అయ్యిన నెమలి పించం దెబ్బలు ఇక్కడ పూర్తి చేసాను . ఎదురుగానే త్రిదేవ్ మందిరం . అదీ అయ్యి మెల్లగా హోటల్ కి చేరాము . ఇక సాయంకాలం గంగా ఘాట్లు , ఆరతి . రేపు . 🙏

Tuesday, April 19, 2022

Emotions recollected in Tranquility-3

 పొద్దున్నే ఆరింటికి గుడి దగ్గరకు చేరాము . ఇదీ కాశి అంటే . ఇరుకు సందులు , అడుగడుకి ఒక గుడి , జనం , జనం . ఆరు కనుక బళ్ళు లేవు . అంటే ఊళ్ళో జనం లేరు . ఉన్నదల్లా మా లాంటి యాత్రికులు . ఇంతకీ మేము వెళ్ళింది కాలభైరవుడి గుడికి .

   కాశీ విశ్వనాధుని చూసే ముందు ఈ కాలభైరవుణ్ణి పర్మిషన్ అడగాలిట . ఆయన కాశీ కీ కోత్వాలు లాగ . నేను ప్రయాణం ప్లానింగ్ లో మా వియ్యపురాలు రాజేష్ రాణి ఖండూజా తో ఈ విషయం చెపితే ఆమె ' అయ్యో మాకు తెలియలేదు . కిందటి సంవత్సరం వెళ్ళాము కాని ఇది ఎవరూ చెప్ప లేదు ' అని వాళ్ళు ట్రిప్ ఏర్పాటు చేసినాయనకు ఫోన్ చేసి అడిగారట . ఆయన సిగ్గు బడుతూ ఒప్పుకుని ఈ సారి రండి ఏర్పాటు చేస్తాను అన్నారుట . ఆయనే మాకు ప్లాన్ చేసింది .

       కాల భైరవును గుడి చిన్న గుడి . అప్పటికే పెద్ద క్యూ . మేమూ పూల సజ్జ , అందులో ఒక ప్లాస్టిక్ కవరులో కొంచం నూనె పొసి ఇచ్చారు . అది దిష్టి లాగ తిప్పి ఇస్తారుట . మా చెప్పులు ఆ దుకాణం దగ్గర వదిలి క్యూ చివర వెతుక్కుంటూ వెళ్ళాము . అలా ఒక ఫర్లాంగ్ నడిస్తే దొరికింది . మేమూ అందులో చేరాము . అది ఒక అనుభవం . మా పక్క నుంచి మోటార్ సైకిళ్ళు , సైక్కిళ్ళు మనుష్యులని తప్పించుకుంటూ వెళ్తున్నాయి . అది ఒక మంచి అవకాశం అక్కడ ఇళ్ళు చూడాడానికి . అన్నీ పురాతనమైన కట్టడాలే . ఎదురెదురు మేడల బాల్కనీలు రోడ్ల పైన ఆర్చి లా ఉన్నాయి . ఇంటి ముందు అరుగులు . అందరివి తలుపులు వేసే ఉన్నాయి . మధ్యలో ఒక గుడి . అక్కడే ఒక పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టుకునే ప్రయత్నం . అదో ప్రపంచం . 

  అన్ని గుళ్ళలో లాగానే వెనక ద్వారం ప్రవేశాలూ ఉన్నాయి . ముందు ఒక క్షణం విసుగు , కోపం వచ్చాయి . తరువాత నవ్వు వచ్చింది . నాకే ఆ అవకాశం వస్తే వెళ్ళనా ? ఇంకోకళ్ళకి వస్తే కోపం తెచ్చుకోవడం అవివేకం . సరే . అలా లోపల కి వెళ్ళి నా ముందు ఉన్న , నిమ్మి , ప్రసాద్ గారు డబ్బులు హుండీలో వేయబోతే ఆ గుడిలో ఉన్న పూజారి , నోటి నిండా పాన్ తో 'హూ ' అని హూంకరించి ఆ డబ్బులు తీసుకుని అందులోనే వేసాడు . కొత్త ప్రదేశం . అక్కడ రీతి తెలియదు . సరే నేను దణ్ణం పెట్టుకుని సజ్జ ఇస్తే అది దేవుడు దగ్గర బెట్టి మళ్ళీ వెనక్కి ఇచ్చారు . నూనె ఏమి ముట్టుకోలేదు . ఆ పక్కన ఒక కర్రకి నెమలి పించం కట్టుకుని వచ్చిన వాళ్ళని కొడుతున్నాడు . డబ్బులు అడుగుతున్నాడు . లైన్లో కుడి వేపు మేము , ఎడమ వేపు భార్గవి విడి పోయాము . తనకి ఈ కొట్టించుకోవడం వెనక కథ తెలుసుట . అందుకని తను కొట్టించుకుంది . మేము చెయ్య లేదు . 

    ఏమా కధ ? మనం చేసిన పాపాలకి కాలభైరవుడు ఆ నరకంలో కొరడాతో శిక్షిస్తాడుట . ఆ శిక్ష తప్పించుకోవాలి అంటే ఇక్కడ కొట్టించుకోవాలిట .

మనిషి మనస్సు ఎంత విచిత్రమైనదో కదా !! తప్పు అని తెలిసి చెయ్యడం . మళ్ళీ లోపల భయం మన మెదడుని తిననీకుండా ఒక solution వెతికేయడం . 

ఇంక బయటపడి గడియారం చూస్తే ఏడో , ఏడుంబావో అయ్యింది . పొద్దున్నే టీ నీళ్ళు నేను , కాఫి నీళ్ళు భార్గవి తాగి బయలుదేరాము కదా ఆత్మ రాముడు నేనున్నాను అని గొడవ మొదలు పెట్టాడు . ఇక్కడ అక్కడ ఎందుకు , మళ్ళీ హోటల్ కి వెళ్ళి breakfast చేద్దాము అని బయలుదేరాము . తరువాత అంతా పది తరువాతే ప్రయాణం అని . మళ్ళీ అంత దూరం ఎందుకూ అంటే -- రూం తో పాటు breakfast free 😁అందుకు .

మరి వెనక్కి వెళ్ళి కాస్త తిని ఒక అరగంట రెస్ట్ తీసుకుని ఇక ఊరి మీద పడ్డాము . ఈ లోపల దిలీప్ మమ్మల్ని గుడి బయట వదిలి మీరు వెళ్ళండి అనేసరికి మాకు అనుమానం మొదలైంది . ఇలా చేస్తే ఇంక విశేషాలు ఎలా తెలుస్తాయి అని . అప్పుడు ఈ ఊళ్ళో ఇంకా ఎవరు తెలుసు అనుకుని మొదలు పెడితే -- ప్రసాద్ గారి కోడలకి తెలిసిన వ్యక్తి , మా కంపెని రిప్రజెంటేటివ్ -- ఇలా గుర్తుకు వచ్చారు . ఇంతలో బండ్ల మాధవరావు గారి ఫోన్ . కాశీ లో ఉన్నారుటగా --BHU కి వెళ్ళండి అని . BHU మా ప్లాన్ లో ఉంది . తెలుగు విభాగానికి వెళ్ళమని సలహా ఇచ్చారు . సరే అనుకున్నాము . 

Emotions recollected in Tranquility-2

 Emotions recollected in tranquility -2 

కాశీ ప్రయాణం -౨

హైదరాబాద్ చేరగానే మళ్ళి బయటకు వచ్చి బాగేజ్ చెక్ ఇన్ చెయ్యవలసి వచ్చింది . టికెట్లు తేదీలు మార్చడం వల్ల తిప్పలు ..నిమ్మి పులిహోర , దద్దోజనం విడివిడిగా pack చేసి తెచ్చింది . ముందు gate no 28 కి చేరి తాపీగా తిన్నాము . ఒక అరగంటలో విమానం ఎక్కమని పిలుపు . ఇది కొంచం పెద్ద విమానం . గంటన్నర లో వారణాశి లో దింపాడు .

     ఏదో ఒక పుస్తకం లో కాశి దూరం నుంచి చూస్తే మండుతున్న  అగ్ని గోళం లా ఉందని రాసారు . ఎవరి కర్మ ప్రారబ్దం బట్టి వారికి కనపడుతుందేమో . మేము దిగే టప్పటికి సూర్యుడు అస్తమిస్తూ కాశీ మబ్బుల్లొ ఉన్నట్లు ఉంది . చూస్తూ దిగి విమానం బయటకు రాగానే అద్భుతమైన సూర్య  బింబం . ఫొటొ తీసాననుకున్నాను  . కాని లేదు .

    మా కోసం మా వియ్యంకులు ఏర్పాటు చేసిన driver cum guide ఎదురు చూస్తూ ఉన్నాడు . అతనే మా హోటల్ బుకింగ్ కి కూడా సాయ పడ్డాడుట . భార్గవికి వచ్చాము , hotel లో ఉండేందుకా గంగ దగ్గరకు వెళ్దాము అఅనిఆలొచన . దిలీప్ , మా driver cum guide ,,మీరు ఇవ్వాళ రెస్ట్ తీసుకొండి , రేపు పొద్దున్నే మీరు అడిగిన కాలభైరవుడితో మొదలు పెట్టి అన్నీ ఆరం సే చూపుతాను అని హామీ ఇచ్చాడు . 

    విమానాస్రయం నుండి పట్టణం కొంచం దూరం . అన్ని పట్టణాలు లాగానే ఉంది .

     కాని ఇది ఇలాంటి అలాంటి పట్టణమా ! కాశీ !

Mark Twain అన్నాడుట :" ఈ నగరం చరిత్ర కంటే పురాతనమైనది . సాంప్రదాయం కంటే పురాతనమైనది ,గాధలు కంటే పురాతనమైనది . వీటన్నిటి కలిపి రెండింతలు చేస్తే , దాని కన్నా పురాతనమైనది ". 

       మా హోటల్ అమాయా cantonment లో ఉంది . అది తరువాత పెరిగిన నగరం . విశాలంగా రోడ్లు , మాల్స్ , ఏ పట్టణమైనా కావచ్చు . అయితే ఒక శుభ వార్త . మోడి గారు రావటం లేదు . యోగి గారి ప్రమాణ స్వీకారం Lucknow లో . ఇద్దరికి మనస్సులో ధన్యవాదాలు చెప్పుకున్నాము . మర్నాడు పొద్దున్నే ఆరుగంటలకు దేవాలయం అని అనుకున్నాము .మేము రూం కి వచ్చి స్నానాలు చేసి , భోజనం ఆయేసరికి eనిమిదిన్నర . ఇంక పొద్దున్నే లేవాలి అని నిద్ర పొయాము . అలా కాశీ లో ఒక రాత్రి . మూడు రాత్రులైనా కాశీ లో  ఉండాలని శాస్త్రం .

  ఆ రాత్రి వీరభద్రుడి గారి ' నేను నడిచిన దారులు 'పుస్తకం చదువుతూ పడుకున్నాము . ఇది మర్నాటి మా ప్రయాణం ప్లాన్ చేసుకునేందుకు సహాయపడింది . వీరభద్రుడి గారికి కృతజ్ఞతలు

Emotions recollected in Tranquility

 Emotions recollected in tranquility!

నేను కవిత్వం రాయదల్చుకోలేదు . మా కాశీ ప్రయాణం భార్గవి బాగా రాసింది . నవలలో ఒక్కొ కారెక్టర్ వారి కథ చెప్తారు కదా ! అట్లాన్న మాట . ఇది కాశి ప్రయాణం నా మాటలలో .

  నాకు కాశి చూడాలని చాలారోజులు నుంచి కోరిక . ఒక్కర్తినే వెళ్ళాలి అంటే కొంచం అయిష్టం . హేమచంద్ర నో అనలేదు కాని కుదరలేదు . పైగా కాశి అనగానే కొంచం పూజ ,,వ్యవహారం ఉంటాయి కదా ! ( అంటే మనం అనుకుంటే) . దీనికి హేమచంద్ర అంత ఉత్సాహం చూపేవాడు కాదు .

   చివరికి నాకు భార్గవి తోడయ్యింది . సరే సరే అనుకున్నాము . ఆదివారం సరదాగ కలుద్దామని వచ్చిన ప్రసాద్ గారూ , నిమ్మి మేమో అన్నారు . అలా ఇద్దరం కాస్త నలుగురు అయ్యాము .

     ముందు హోళి పండుగ చూసుకోకుండా టికెట్లు బుక్ చేసాను ..మా వియ్యంకులు డెల్లి నివాసం . ఈ రోజుల్లో మీరు కాశి వెడితే హోటల్ రూం లో నాలుగు రోజులు ఉండి వెనక్కి వస్తారు . లోకల్స్ బయటకు వెళ్ళడానికి భయ పడతారు అనేసరికి ఒక వారం పొస్ట్పోన్ చేసాను ప్రయాణం . తడిసి మోపెడయ్యింది . తగ్గేదేలే అంటూ టిక్కెట్లు , హోటల్ బుకింగ్ అన్ని చేసాము . నా ముందు ఆలొచన ఘాట్స్ దగ్గర హోటల్ అని . దానికి రమా శాండిల్యా గారి సలహా కూడా తీసుకున్నాము . అంతలో మరో పిడుగు లాంటి వార్త ! అప్పుడే , ఆ తారెకుల్లోనే మోడి గారు , యోగి గారు విశ్వనాధ దర్శనం అనుకుంటున్నారని ! హత విధీ ! 

   సరే . ఒక నిర్ణయానికి వచ్చాను . ఘాట్ కి దూరంగా హోటల్ తీసుకుంటే , వీళ్ళు వస్తే ఆ రోజుల్లో చుట్టు పక్కల చూద్దాము , వాళ్ళు వెళ్ళాక విశ్వనాధ దర్శనం అనుకున్నాము . అలా నిర్ణయించుకుని మొదలు పెట్టామండి ప్రయాణం ! 

     ముందు ఏ ప్రయాణనానికైనా కావల్సింది ఏమిటి ? ఫొటొలు !!!ముందు విజయవాడ విమానాశ్రయం లో ఫొటొ ! ( కింద చూడుడు ) 

    నాకు కొంచం వయస్సు వచ్చాక ముందు వెళ్ళి స్టేషన్ లో కూర్చుందామని ఫీలింగ్ . అలాగే ముందు వెళ్ళాము ..విజయవాడ నుండి హైదరాబాద్ . అక్కడ ఓ రరెండుగంటల తరువాత హైదరాబద్ నుండి వారణాసి . 

    ఊరుకునే కూర్చుంటే ఎలా అని అక్కడున్న షాపులు చూసాను ..నేను కాలేజిలో చదివటప్పుడు ఇలాంటి earrings మా స్నేహితురాలికి వుండేది . అపుడే నాకు చాల నచ్చింది . అదేమో బంగారం . ఇది కాదు . పైగా pretty woman అఅంటొది షాప్ పైన బోర్డ్ . నా వయస్సు మర్చి పోయి హాయిగా వెళ్ళి కకొనుక్కుని. ఫోటో తీసుకున్నాను ..ఫొటొ వయస్సు చెప్పేసింది . అయితే ఏమిటట ? 

    అలా చిన్న డకోటా లాంటి విమానం ఎక్కాము . అలాంటి విమనాలు మనకి షాపులో దొరుకుతాయి . ఎటొచ్చి ఎగరవు అంతే . ఇంతోటి హైదరబాదు కి ఇది చాల్లే అఅని నిర్ణయించాడు Indigo . eఎదుట్ సీట్లో పిల్లవాడు -- అన్నిటికి ఆశ్చర్య పోతూ ఉంటే కాసేపు బాగుంది . కాని ఆ పిల్లాడి తాత airplane security measures card తీసి కూతురికి ఇచ్చి బాగ్ లో పెట్టు అంటే నవ్వేసాము . అలా నవ్వ కూడదు . అయినా ఆగలేదు . ఇలా చేరామండి హైదరాబాదు . మళ్ళీ రేపు ( భార్గవి తో కూడా ఒక ఫోటో ఉండాలి )

Emotions recollected in tranquility!

నేను కవిత్వం రాయదల్చుకోలేదు . మా కాశీ ప్రయాణం భార్గవి బాగా రాసింది . నవలలో ఒక్కొ కారెక్టర్ వారి కథ చెప్తారు కదా ! అట్లాన్న మాట . ఇది కాశి ప్రయాణం నా మాటలలో .

  నాకు కాశి చూడాలని చాలారోజులు నుంచి కోరిక . ఒక్కర్తినే వెళ్ళాలి అంటే కొంచం అయిష్టం . హేమచంద్ర నో అనలేదు కాని కుదరలేదు . పైగా కాశి అనగానే కొంచం పూజ ,,వ్యవహారం ఉంటాయి కదా ! ( అంటే మనం అనుకుంటే) . దీనికి హేమచంద్ర అంత ఉత్సాహం చూపేవాడు కాదు .

   చివరికి నాకు భార్గవి తోడయ్యింది . సరే సరే అనుకున్నాము . ఆదివారం సరదాగ కలుద్దామని వచ్చిన ప్రసాద్ గారూ , నిమ్మి మేమో అన్నారు . అలా ఇద్దరం కాస్త నలుగురు అయ్యాము .

     ముందు హోళి పండుగ చూసుకోకుండా టికెట్లు బుక్ చేసాను ..మా వియ్యంకులు డెల్లి నివాసం . ఈ రోజుల్లో మీరు కాశి వెడితే హోటల్ రూం లో నాలుగు రోజులు ఉండి వెనక్కి వస్తారు . లోకల్స్ బయటకు వెళ్ళడానికి భయ పడతారు అనేసరికి ఒక వారం పొస్ట్పోన్ చేసాను ప్రయాణం . తడిసి మోపెడయ్యింది . తగ్గేదేలే అంటూ టిక్కెట్లు , హోటల్ బుకింగ్ అన్ని చేసాము . నా ముందు ఆలొచన ఘాట్స్ దగ్గర హోటల్ అని . దానికి రమా శాండిల్యా గారి సలహా కూడా తీసుకున్నాము . అంతలో మరో పిడుగు లాంటి వార్త ! అప్పుడే , ఆ తారెకుల్లోనే మోడి గారు , యోగి గారు విశ్వనాధ దర్శనం అనుకుంటున్నారని ! హత విధీ ! 

   సరే . ఒక నిర్ణయానికి వచ్చాను . ఘాట్ కి దూరంగా హోటల్ తీసుకుంటే , వీళ్ళు వస్తే ఆ రోజుల్లో చుట్టు పక్కల చూద్దాము , వాళ్ళు వెళ్ళాక విశ్వనాధ దర్శనం అనుకున్నాము . అలా నిర్ణయించుకుని మొదలు పెట్టామండి ప్రయాణం ! 

     ముందు ఏ ప్రయాణనానికైనా కావల్సింది ఏమిటి ? ఫొటొలు !!!ముందు విజయవాడ విమానాశ్రయం లో ఫొటొ 

    నాకు కొంచం వయస్సు వచ్చాక ముందు వెళ్ళి స్టేషన్ లో కూర్చుందామని ఫీలింగ్ . అలాగే ముందు వెళ్ళాము ..విజయవాడ నుండి హైదరాబాద్ . అక్కడ ఓ రరెండుగంటల తరువాత హైదరాబద్ నుండి వారణాసి . 

    ఊరుకునే కూర్చుంటే ఎలా అని అక్కడున్న షాపులు చూసాను ..నేను కాలేజిలో చదివటప్పుడు ఇలాంటి earrings మా స్నేహితురాలికి వుండేది . అపుడే నాకు చాల నచ్చింది . అదేమో బంగారం . ఇది కాదు . పైగా pretty woman అఅంటొది షాప్ పైన బోర్డ్ . నా వయస్సు మర్చి పోయి హాయిగా వెళ్ళి కకొనుక్కుని. ఫోటో తీసుకున్నాను ..ఫొటొ వయస్సు చెప్పేసింది . అయితే ఏమిటట ? 

    అలా చిన్న డకోటా లాంటి విమానం ఎక్కాము . అలాంటి విమనాలు మనకి షాపులో దొరుకుతాయి . ఎటొచ్చి ఎగరవు అంతే . ఇంతోటి హైదరబాదు కి ఇది చాల్లే అఅని నిర్ణయించాడు Indigo . ఎదుట  సీట్లో పిల్లవాడు -- అన్నిటికి ఆశ్చర్య పోతూ ఉంటే కాసేపు బాగుంది . కాని ఆ పిల్లాడి తాత airplane security measures card తీసి కూతురికి ఇచ్చి బాగ్ లో పెట్టు అంటే నవ్వేసాము . అలా నవ్వ కూడదు . అయినా ఆగలేదు . ఇలా చేరామండి హైదరాబాదు . మళ్ళీ రేపు .